5, ఏప్రిల్ 2016, మంగళవారం

బద్దలైన కుబేరుల బాగోతం పార్ట్‌-2 
పనామా పేపర్స్‌తో వెలుగులోకి వచ్చిన నల్లధన కుబేరుల్లో 500 మంది భారతీయులున్న సంగతి తెలిసిందే. తాజాగా వారిలో మరికొందరి పేర్లు వెల్లడయ్యాయి. నిన్న బాలీవుడ్‌ ప్రముఖులు.. అమితాబ్‌ బచ్చన్‌.. ఐశ్వర్యారాయ్‌.. కొందరు వ్యాపారవేత్తల పేర్లు మాత్రమే వెల్లడి కాగా.. ఈ రోజు మరికొందరి పేర్లు బయటపడ్డాయి. ఆ జాబితా చూస్తే..
1. అశ్వని కుమార్‌ మెహతా 
1999 నుంచి ఇతని కుటుంబ సభ్యుల పేర్లతో కరీబియన్‌ దీవులు.. బ్రిటిష్‌ వర్జిన్‌ దీవుల్లో 7 ఆఫ్‌షోర్‌ సంస్థలు రిజిస్టరై ఉన్నట్లు తేలింది. మెహతా.. అతని భార్య.. ఇద్దరు కుమారుల పేరుమీదే కాకుండా.. కోడళ్లను డైరెక్టర్లుగా పేర్కొన్నట్లు మొసాక్‌ ఫొన్సెకా పత్రాల్లో వెల్లడైంది.
వారి స్పందన: ‘మాకు స్టోన్‌బై ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌.. మ్యాక్స్‌హిల్‌ లిమిటెడ్‌ కంపెనీల్లో షేర్లు ఉన్నాయి. కానీ.. పెట్టుబడులు అన్నీ సాధారణ బ్యాంకు లావాదేవీల ద్వారానే పెట్టాం. ఆ వివరాలను మా ఐటీ రిటర్న్స్‌లోనూ చూపించాం’.
2. అనురాగ్‌ కేజ్రీవాల్‌(లోక్‌సత్తా పార్టీ దిల్లీ మాజీ అధ్యక్షుడు) 
బ్రిటిష్‌ వర్జిన్‌ దీవుల్లో కనీసం మూడు సంస్థలు.. పనామాలో రెండు ప్రైవేటు ఫౌండేషన్లకు ఇతను డైరెక్టరుగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. నెవింగ్టన్‌ గ్రూప్‌ ట్రేడింగ్‌ లిమిటెడ్‌.. నెడ్‌స్టార్‌ కమర్షియల్‌ లిమిటెడ్‌.. క్రిమ్స్‌ ఇన్వెస్టిమెంట్స్‌ ఇన్‌కార్పొరేట్‌ అనే సంస్థలు బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో రిజిస్టరై ఉన్నట్లు తెలిసింది.
స్పందన: తాను వ్యాపారవేత్తనని, ఐరన్‌ ఓర్‌ బిజినెస్‌ చేస్తానని అనురాగ్‌ తెలిపారు. మంచిమార్గంలోనే కమిషన్‌ పొందామన్నారు. చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సాయంతో ఈ సంస్థలు ఏర్పాటుచేసినా వాటివల్ల సమస్యలు వస్తాయని త్వరగానే అర్థమైందన్నారు. భారతీయ రిజర్వు బ్యాంకు నియమనిబంధనల గురించి చెప్పుకొస్తూ తమ వద్ద స్ట్రాంగ్‌ కేపిటల్‌ బేస్‌ లేనందువల్ల రెండు ఫౌండేషన్లను త్వరగానే మూసేశామని ఆయన చెప్పారు.
3. గౌతమ్‌ మరియు కరన్‌ థాపర్‌ 
క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ సంస్థకు చెందిన వీళ్లకు పనామాలో చార్ల్‌వుడ్‌.. నికామ్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్లు ఉన్నాయి. 2005 జులైలో చార్ల్‌వుడ్‌ ఫౌండేషన్‌ను 10వేల అమెరికన్‌ డాలర్లతో ప్రారంభించినట్లు పత్రాల్లో తేలింది. అదే ఏడాది అక్టోబర్‌లో నికామ్‌ ఇంటర్నేషనల్‌ను కూడా స్థాపించారు.
స్పందన: గౌతమ్‌ థాపర్‌ తరఫున ఆయన ప్రతినిధి మాట్లాడుతూ.. థాపర్‌ ఎలాంటి ఫౌండేషన్‌ను ప్రారంభించలేదు. ఒక్క ఆఫ్‌షోర్‌ కంపెనీలోనూ ఆయనకు షేర్లు/భాగస్వామ్యం లేవు. జర్మన్‌ పౌరసత్వం ఉన్న అతని భార్య మాత్రం చార్ల్‌వుడ్‌ ఫౌండేషన్‌లో లబ్ధిదారుగా ఉన్నారు.. అని చెప్పారు.
4. సతీష్‌ గోవింద్‌ సాంతాని, విష్లావ్‌ బహదూర్‌, హరీశ్‌ మొహ్నాని 
బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో రెండు సంస్థలకు ఈ ముగ్గురు డైరెక్టర్లుగా ఉన్నారు. 2008 డిసెంబర్‌ 4న డిజైన్‌ అండ్‌ క్వాలిటీ లిమిటెడ్‌, 2007 నవంబర్‌లో త్రిలియాన్‌ లిమిటెడ్‌ అనే ఆఫ్‌షోర్‌ కంపెనీలను ప్రారంభించారు.
స్పందన: ‘‘చైనా నుంచి దుస్తులు.. ఇతర సరుకులను రవాణా చేసేందుకు ఆ రెండు సంస్థలను స్థాపించాం. మూడు సంవత్సరాలు నడిపిన తర్వాత మూసివేశాం’’ అని విష్లావ్‌ బహదూర్‌ అన్నారు.
5. గౌతమ్‌ సీంగల్‌ 
400 మిలియన్‌ డాలర్ల ప్రైవేటు ఈక్విటీ ఫండ్‌తో లింకప్‌ ఉన్నట్లు తేలింది. అలాగే.. అతని పేరుతోనే మరో రెండు ఆఫ్‌షోర్‌ సంస్థలు కూడా రిజిస్టరై ఉన్నాయి. బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో ఐమీడియా వెంచర్స్‌ లిమిటెడ్‌ను 2006లో ప్రారంభించాడు. దాన్ని 2009 నవంబర్‌లో జెఫ్‌ మోర్గాన్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌గా పేరు మార్చారు.
స్పందన: నాకు ఆ ఆఫ్‌షోర్‌ సంస్థలతో సంబంధం లేదు. అవి.. మా నాన్నకు చెందినవి. కుటుంబం నుంచి విడిపోయాక.. ఆ కంపెనీలకు చాలా దూరంగా ఉంటున్నా. అవి కూడా ప్రస్తుతం మూతపడ్డాయనుకుంటున్నాను.
6. ప్రకాశ్‌ సంఖ్లా 
మధ్యప్రదేశ్‌కు చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి అయిన ప్రకాశ్‌ సంఖ్లాకు పనామాలో లోటస్‌ హారిజాన్‌ ఎస్‌ఏ అనే సంస్థ ఉంది. అందులో ఆయన కుమార్తెలు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిసంది.
‘‘నా అల్లుడు పెద్ద బిజినెస్‌ మ్యాన్‌. నిత్యం వివిధ దేశాలు తిరుగుతుంటాడు. అతనికి యూఎస్‌.. కెనడాలో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఆయన సంస్థల్లో నేను ఒక్క పైసా కూడా పెట్టుబడిగా పెట్టలేదు’’ అని సంఖ్లా అన్నారు.
7. వినోద్‌ రామ్‌చంద్ర జాదవ్‌ 
బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో పలు సంస్థలున్నాయి. పుణెలోని సవా హెల్త్‌కేర్‌ సంస్థకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న వినోద్‌.. పలు ఆఫ్‌షోర్‌ కంపెనీల్లో షేర్‌ హోల్డర్‌గా.. డైరెక్టరుగా ఉన్నారు. వాటిల్లో 2010 నుంచి 2015 మధ్యలో స్థాపించినవే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
స్పందన: అన్ని గ్లోబల్‌ కంపెనీల ఆదాయ వివరాలను రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌కి సమర్పించాం. కానీ గతేడాది ఇవ్వలేదు. ఇప్పటి వరకూ ఏ వివరాలను రహస్యంగా ఉంచలేదు.
8. అశోక్‌ మల్హోత్రా 
బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లోని ఈ అండ్‌ పీ ఆన్‌లుకర్స్‌ లిమిటెడ్‌ సంస్థకు షేర్‌ హోల్డర్‌గా.. డైరెక్టర్‌గా ఉన్నారు. 2008 సెప్టెంబర్‌ 25న ఈ సంస్థను స్థాపించినట్లు పనామా పేపర్స్‌ వెల్లడిస్తున్నాయి.
స్పందన: షేర్లు ట్రాన్స్‌ఫర్‌ అయ్యినా.. నాకు గుర్తు లేదు. అది చాలా ఏళ్ల క్రితం జరిగింది. అప్పుడే షేర్లన్నీ అమ్మేశాం.
9. రంజీవ్‌ దహుజా, కపిల్‌ సైన్‌ గోయల్‌ 
బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో ఉన్న బీల్స్‌ ఇంటర్నేషనల్‌ కార్ప్‌ సంస్థకు డైరెక్టర్లుగా ఉన్నారు. 2012 జూన్‌లో ప్రారంభించిన ఈ కంపెనీలో వీళ్లు 5000 షేర్లు కలిగి ఉన్నారు.
స్పందన: ‘‘మేము కొన్ని సంవత్సరాల క్రితం ఈ కంపెనీని ప్రారంభించాం. కానీ.. ఇప్పటి వరకూ ఒక్క పని కూడా చేయలేదు. కొందరు తప్పుదారి పట్టించడం వల్ల ఆ కంపెనీని స్థాపించాల్సి వచ్చింది’’ అని కపిల్‌ సైన్‌ గోయల్‌ అన్నారు.
10. వివేక్‌ జైన్‌ 
బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లోని ‘సాక్వినవ్‌ గ్లోబల్‌ ఎస్‌ఏ’కు డైరెక్టర్‌గా.. హాంకాంగ్‌లో ఉన్న రేడియంట్‌ వరల్డ్‌ హోల్డింగ్స్‌లో షేర్లు కలిగి ఉన్నారు.
స్పందన: ‘‘ఈ కంపెనీలు ఉన్నట్లు నాకు ఐడియా లేదు. నా పేరు.. అడ్రస్‌తో కంపెనీ రిజిస్టరై ఉంటే నాకు తెలిసి ఉండేది’’ అని వివేక్‌ జైన్‌ అన్నారు.
ఎవరి చేతిలో సృష్టించావు బాబూ!
PUBLISHED: SUN,MAY 31, 2015 12:03 AM  Increase Font Size Reset Font Size decrease Font size  
నీ సంపద సృష్టికి ప్రజల చేతుల్లో వనరులు పెట్టాలి. చెరువులు బాగుచెయ్యాలి. పొలాలకు నీరివ్వాలి. విద్యుత్ ఉత్పత్తి పెంచాలి. సంపద పెరగాలి. కానీ అది సమాజ సంపద కావాలి. సంపద పెరగాలి కానీ అది ప్రజల కోసం పెరగాలి. ప్రజల పరం కావాలి. అంతేకానీ విసిరేస్తే రాలే గింజలు కాదు. జనమంటే అడుక్కుతినేవాళ్లో నువు పారేసింది ఏరుకునే వాళ్లో కాదు. సృష్టించింది చాల్లే గానీ, అది కరిగి జనంలోకి ప్రవహించే
చిత్తశుద్ధి చూపియ్యండి బాబు గోరూ!

చేతి మంత్రదండముతో ఎంతెంత సంపద సృష్టించినావు బాబూ. దొర గారూ. దొరలబాబుగారూ. సంపద. ఎటుచూసినా సంపద. కళ్లు తిరిగిపోయే సంపద. మల్టీ ప్లెక్సులు, మెగామాల్‌లు, రిసార్టులు, గోల్ఫ్‌లు, నోవోటెల్‌లు, పబ్బులు కళ్లు మబ్బులు పట్టే ప్లేబోయ్ క్లబ్బులు. క్లబ్బుల్లో మెరుపువెలుగుల మసకచాటు జీవితాలు. రోడ్డు మీద బియండబ్ల్యులు, పార్టీ ఆఫీసుల ముందు పోర్ష్‌కార్లు, కాఫీ షాపుల ముందు కిడ్స్ పార్క్ చేసే మినీ కూపర్‌లు. ద్యావుడా... ఏం సంపదరా బాబూ. వర్టిగో వచ్చి కళ్లు తిరిగేంత సంపద. ఈ భోగభాగ్యవైభవ చంద్రిక గురించి ఒక చిన్న ప్రశ్న వేసుకొని బ్రేక్ తీసుకుని బ్రీత్ తీసుకుని మరిన్ని వివరాల్లోకి వెళ్దాం. కొంచెం వాటర్ తాగండి.

సంపద సృష్టించా! అనే మహానాటి ప్రకటన చూసి ఆ స్థాయిలో కాకపోయినా ఏదో మనకున్నంత బుర్రలో ఓ చిన్నప్రశ్న మొలిచింది. అదేమనగా....ఎవరి చేతిలో?. ఈ అనంత సంపద. షాంపేన్ నురగలా ఆగకుండా పొంగే సంపద ఎవరి చేత ఎవరి కోసం ఎలా సృష్టించబడింది. దాన్ని అనుబగిస్తున్న రాజాలెవరు. ఈ సంపద గుట్టలు పెరిగి పెద్దయిపోతుండగా వాటివైపు ఆశగా తలెత్తి చూస్తూ మిగి లిపోయే బతుకులెవరివి.
ఓ సీను. మీరే ఇమేజిన్ చేసుకోండి. ఒకాయన. సకల సిరిసంపదలతో ఊగితూ లిసోలిపోయేటాయన.

ఆయన తనకు చవగ్గా దొరికిన భూములు, ఫీజు లేకుండా దొరికిన లైసెన్సులు, భారీగా దొరికిన రాయితీల ద్వారా వచ్చిపడిన సంపద లోంచి కొంత తీసి ఇంట్లో జలపాతం కట్టుకున్నాడు. దాని నుంచి ఫోర్సుగా ఎగసిపడ్డ నీటి తుంపరలు ఆయన ఇంటి గోడవతల నివాసముంటున్న గుడిసెవాసుల మీద కూడా పడ్డాయి. వారు నాలుకలు బయటపెట్టి నిలబడితే వారి దాహం తీర్చాయి. దీన్ని ట్రికిల్ డౌన్ అంటారు. సృష్టించబడిన జలసంపద ఎంత ఎక్కువైతే నాలుకలు చాచి దాహం దాహం అంటున్న వారి గొంతు అంత ఎక్కువగా తడుస్తుంది.

రాశుల రాశుల సంపద నాటి నైజాము సర్కరోడికీ ఉంది. నేటి సుభ్రతో రాయ్‌కీ ఉంది. బ్రూనే సుల్తాను వరకూ ఎందుకు సుజనులు, నానీలు, జగనులు, మాట్రిక్సులు, గాలి రామలింగడులు వీరందరికీ సంపద ఉంది. భారతదేశములో వలే తెలుగు రాజ్యాలలో కూడా గత ఇరవై ఏళ్లలో నియోరిచ్ బాబులు పుట్టలు పుట్టలుగా పెరిగారు. సంపద పెంచుకున్నారు. ఆర్థిక అసమానతలు గత ఇరవై ఏళ్లకాలంలో రెండొందల శాతం పెరిగాయి. ఉన్నోడికీ లేనోడికీ మధ్య దూరం కొన్ని కాంతి సంవత్సరాలంత పెరిగిపోతున్నది. కనుక సంపద నిజం. కానీ, అది రాను రానూ కొందరిచేతిలోనే పేరుకుపోతున్నది చేదునిజం.

ప్రపంచబ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వాల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్- ఎవరి లక్ష్యమైనా ఒకటే. సంపద సృష్టించడం. పెద్ద కెరటం వచ్చినపుడు అన్ని పడ వలూ పైకి లేస్తాయని చెప్పడమే ఆ విధాన సారాంశం. మొదట చంద్రబాబూ ఆపై రాజశేఖరరెడ్డి సంపద సృష్టి సిద్ధాంతాన్ని బాగా నమ్మారు. ఒకోసారి వాళ్లు తెలియక నమ్మారేమో అని కూడా అనుమానం వచ్చేది. కానీ మొన్నటి మహాప్రకటనతో ఆ అనుమానం పోయింది. కార్పొరేట్ ఆసుపత్రుల యజమానులు వైద్యమంత్రులూ కార్పొరేట్ కళాశాలల యజమానులు విద్యామంత్రులూ అవుతున్న వైనం చూసినా రాజధాని నిర్మాణంలో ఎంచుకున్న విధానం చూసినా, సంపద సృష్టి మోజు ఎంత పీక్‌లో ఉందో వెర్రీవీజీగా అర్ధమైపోతుంది.

ఉన్నతాదాయ వనరులకూ వ్యాపారులకూ కల్పించే ఆర్థిక ప్రయోజనాలు, తద్వారా పోగుపడే సంపదలు పరోక్షంగా సమాజంలోని పేదవర్గాలకు మేలు చేస్తా యని ఒక వాదన. ఇదే ట్రికిల్ డౌన్. మహామాంద్యం కాలంలో విల్‌రోజర్స్ అనే ఒక అమెరికన్ వ్యంగ్యవ్యాఖ్యాత కాయిన్ చేసిన పదమిది. ఇది వాడుకున్నోడికి వాడుకున్నంత. ట్రికిల్ డౌన్ సిద్ధాంతం అధికారికంగా ఒక అర్ధశాస్త్ర పారిభాషికపదం కాకపోయినా, కేపిటలిస్టు రాజకీయాలు ఈ కాన్సెప్టును బాగా వాడుకున్నాయి. సంక్షేమపద్దులపై కోతలు విధించడానికి ధనికులకు కార్పొరేట్లకు మేళ్లు చేసే రాయి తీలు కల్పించడానికి, కేటాయింపులు జరపడానికీ ఇదొక బహానాగా పనికొచ్చింది. పనికొస్తూనే ఉంది. దురదృష్టావశాత్తూ ఇదొక విఫల విధానమనీ, దీని ఫలితాలు వ్యతిరేక ప్రభావాన్ని చూపించాయనీ అనేక ప్రభుత్వాల అనుభవం నిరూపించింది. అయినంక కూడా సంపద సృష్టి నినాదం ప్రవచిస్తున్నారంటే దాని వెనుక వర్గప్రయోజనాన్ని చూడాల్సిరాక తప్పదు తమ్ముళ్లూ.

నిజానికి ఇది చాలా పాతది. అమెరికాలో పంతొమ్మిదో శతాబ్దం కాలంలోనే దీన్ని పరీక్షించారు. దాన్నే హార్స్ అండ్ స్పారో సిద్ధాంతమని వెటకరించారు. గుర్రా నికి బాగా గుగ్గిళ్లు తినిపిస్తే అది రోడ్డు మీద విసర్జించే ఫీకల్ మేటర్‌తో కాకులకు ఆహారం దండిగా దొరుకుద్దని దాని సారము. ఏం చేస్తే ఏం. మార్కెట్ లేవాలి. ఎవరు మునిగినా. కార్పొరేట్ల మీద పన్నుభారం తగ్గించి వాళ్ల లాభాలు పెంచితే ముందుగా అవి ఉద్యోగులకిచ్చే జీతాల్లో రిఫ్లెక్టవుతాయనే ఆశతో (ఆశపెట్టి) పాతికేళ్ల క్రితమే రీగనామిక్స్ పెట్టుబడిదారీ దేశాలను ఆకర్షించాయి. రీగన్ అడ్మిన్‌లో బడ్జెట్ ఎడ్వయిజర్ డేవిడ్‌స్టాక్‌మన్ ఆలోచన ఇది. కానీ, కొంతకాలానికి ఆయనే ఈ విధానం ప్రయోజనం మీద అనుమానంలో పడిపోయాడు.

అయినా ఆ తర్వాత మార్గరెట్ ధాచర్‌తో సహా ఎంతోమంది దేశాధినేతలు ఆ మార్గంలో నడిచారు. ఒబామా బెయిలవుట్లు ఈ సిద్ధాంతం వెలుగులోవే!గత కొన్ని దశాబ్దాలుగా వాస్తవిక అర్ధంలో ఉద్యోగకల్పన తరిగిపోతున్నది. నిజ వేతనాలు తరిగిపోతున్నవి. దీనంతటికీ కారణం ఈ విధానాల కారణంగా సంపద కొద్దిమంది దగ్గర కేంద్రీకృతమైపోవడం. 2012లో టాక్స్ జస్టిస్ నెట్‌వర్క్ జరిపిన అధ్యయనం ఇలాంటి సంపదసృష్టివాదుల నెత్తిన ఒకటి పీకింది. సూపర్‌రిచ్ చేతుల్లో పోగుపడ్డ సంపద నుంచి బొట్లేమీ కారడం లేదనీ, నిజానికి ఆ అపార సంప దంతా టాక్స్ హెవెన్స్‌లో దాచి పెట్టడమో నిజమైన డిక్లరేషన్స్ నుంచి తప్పిం చుకోవడమో జరిగింది కానీ, ఆయా దేశాల ఆర్ధిక వ్యవస్థలకు తద్వారా పేదలకూ ఒరిగిందేమీ లేదని క్లియర్ పిక్చర్ తేల్చేసింది. ఏ సూచిక చూసినా ప్రపం చవ్యాప్తంగా ధనికులకూ పేదలకూ మధ్య అంతరాలు శరవేగంగా పెరిగిపో తున్నాయేగానీ ఎక్కడ తగ్గడం లేదని చెబుతూనే ఉన్నాయి.

సాటి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇండియాలో ఈ అంతరం మరీ ఎక్కువ. అది పెరుగుతున్న వేగం ఎక్కువ. ఈ అంతరాలు ఇదే వేగంతో సాగితే ఈ సంపద మరింత వారి చేతిలో పోగుపడటం ఖాయం. అభివృద్ధీ అది పోగుచేసిన సంపదల్లో భూమిపుత్రులకు భాగం దొరకనపుడే పోరాటాలు రగులుతాయి. లాటినమెరికా నుంచి తెలంగాణ వరకూ రుజువైంది ఇదే. బాబు గారిలాంటోళ్లు నేర్చుకోలేని పాఠమూ ఇదే.

చంద్రబాబు వంటి నేతలు రాష్ర్టాల్లోనూ మోడీగారు దేశంలోనూ కార్పొరేట్ల రుణం తీర్చుకునే పనిలో ఈ సంపద సృష్టి సిద్ధాంతపు దొంగజపం చేస్తున్నారు. చంద్రబాబు విధానాలు ఈపాటికే సంపదను కేంద్రీకృతం చేశాయి. ఆయన హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో నియోరిచ్‌లు విపరీతంగా పెరిగిపోయారు. వాళ్లే ఆ తర్వాత రకరకాల స్కాముల్లో ఆర్ధికనేరాల్లో నిందులయ్యారు. సింగపూర్‌లు కడ తారు సరే ఆ ఆకాశహర్మ్యాల్లో నివసించేదెవరు. ఆ రహదారులపై రివ్వున దూసు కుపోయే ఖరీదైన కార్లెవరివి. సంపద సృష్టించా-ఆయన డబ్బా కొట్టకోడమూ వీళ్లు తాటికాయ లైన్లు బేనర్ పెట్టడమూ. హు హ్.

సంపద సృష్టికి ప్రజల చేతుల్లో వనరులు పెట్టాలి. చెరువులు బాగుచెయ్యాలి. పొలాలకు నీరివ్వాలి. విద్యుత్ ఉత్పత్తి పెంచాలి. సంపద పెరగాలి. కానీ అది సమాజ సంపద కావాలి. సంపద పెరగాలి కానీ అది ప్రజల కోసం పెరగాలి. ప్రజల పరం కావాలి. అంతేకానీ విసిరేస్తే రాలే గింజలు కాదు. జనమంటే అడుక్కుతినేవాళ్లో నువు పారేసింది ఏరుకునే వాళ్లో కాదు. సృష్టించింది చాల్లే గానీ, అది కరిగి జనంలోకి ప్రవహించే చిత్తశుద్ధి చూపియ్యండి బాబు గోరూ! ఆఫ్టర్ ఆల్ మనది 20 కోట్ల మందికి తిండే దొరకని దేశం.


రెండు గరుడ ప్లస్ బస్సుల్లో పట్టే మంది కంటే తక్కువ మంది దగ్గర ఉన్న ఆస్తి ఎంతో తెలుసా? ఈ విషయం తెలుసుకుంటే నోటి వెంట మాట రాని పరిస్థితి. రోజులు గడుస్తున్న కొద్దీ.. ఆర్థిక అంతరాలు మరింత పెరిగిపోవటమే కాదు.. సంపన్నుడు మరింత స్ట్రాంగ్ అయిపోతున్నాడు.ఇక.. పేదోడి బతుకులు పేదగానే ఉండిపోతున్నాయి. అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నా.. వాటి ఫలాలు.. ప్రయోజనాలు పొందుతున్న వారు మాత్రం గుప్పెడు మంది మాత్రమే కావటం గమనార్హం.

ప్రపంచంలోని ఆస్తి మొత్తంలో సగం కేవలం 62 మంది దగ్గరే పోగుపడటం చూస్తే.. సంపన్నులు ఎంత స్ట్రాంగ్ అవుతున్నది ఇట్టే అర్థమవుతుంది. ఏడాదికేడాది గడిచే కొద్దీ సంపన్నులు మరింత సంపన్నులుగా మారిపోతున్నారు. ఈ వాదన నమ్మబుద్ధి కాకపోతే.. ఆక్స్ ఫామ్ చేసిన అధ్యయన వివరాలు చూస్తే కఠిన నిజం కళ్ల ముందు కనిపించక మానదు. 2010లో ప్రపంచంలోని సగం సంపద 388 మంది దగ్గర పోగుపడి ఉంటే.. 2011 నాటికి 177కి పడిపోయింది. ఇక.. 2012 వచ్చేసరికి 159 మందికి పరిమితమైతే.. 2013 నాటికి 92 మందికి కుంచించుకుపోయింది. ఇక.. 2014 నాటికి 80కి.. 2015 పూర్తి అయ్యేసరికి ప్రపంచంలోని సగం సంపద కేవలం 62 మంది వచ్చే రాశులు.. రాశులుగా పేరుకుపోవటం గమనార్హం.

మొత్తం ప్రపంచ జనాభా సుమారు 370 కోట్ల మంది ఉంటే.. అందులో సగం మంది దగ్గరున్న ఆస్తి.. కేవలం 62 మంది దగ్గర ఉండటం షాక్ అనిపించక మానదు. ఈ అపర కుబేరుల ఆస్తి మొత్తం (62 మందిది) లెక్కేస్తే వచ్చే మొత్తం రూ.11915983 కోట్లుగా తేలింది.

ఉపాధి రహిత అభివృద్ధి ఎందువల్ల?
* పెట్టుబడి పక్షపాతులైన ప్రభుత్వాలు
* ఆర్థిక వ్యవస్థలో లోపిస్తున్న సమతౌల్యం
* వికటిస్తున్న శ్రమ - పెట్టుబడి సంబంధాలు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం నుండి బయటపడుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి మొదలు ఐఎంఎఫ్‌ వరకూ ఉపాధి రహిత అభివృద్ధి గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ ఆర్థిక వ్యవస్థల వివరాలతో అమెరికా, భారతదేశాల్లో ఉపాధి రహిత అభివృద్ధి తీరుతెన్నుల గురించి గత రెండు వారాలుగా చర్చించుకున్నాము. ఈ వారం అసలు అభివృద్ధి ఉపాధి రహితంగా ఎందుకు మారుతుందన్న మౌలిక ప్రశ్న గురించి చర్చించుకుందాం.

సంస్కరణల వేగంతో మరుగుపడిన వ్యవస్థాగత సమతౌల్యం

తాజా సంక్షోభానికి పూర్వం కూడా ఉపాధి రహిత అభివృద్ధి గురించి అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి నివేదికలు హెచ్చరిస్తూనే వచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానం పాత్ర పెరిగే కొద్దీ ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి రేట్లు వేగంగా పెరుగుతున్నాయని, అంతే వేగంగా ఉపాధి కల్పన పెరగట్లేదు. వ్యవస్థల మధ్య సమతౌల్యం దెబ్బతింటోందనీ ఐఎల్‌ఒ మూడు దశాబ్దాలుగా మొత్తుకుంటూనే ఉంది. కానీ ప్రపంచీకరణ గాలుల్లో విహరిస్తున్న దేశాధినేతలకు ఈ హెచ్చరికలు చెవికెక్కలేదు. 2007లో సంక్షోభం తెరమీదకు రావటానికి ముందు కూడా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం - యుఎన్‌డిపి, ఐఎల్‌ఒ సంయుక్త అధ్యయనాన్ని నిర్వహించాయి. గతంలో వేగంగా అభివృద్ది చెందిన ఆసియా దేశాలుగానీ, నేడు అభివృద్ధి చెందుతున్న దక్షిణాసియా దేశాలుగానీ జాతీయ ఆర్థికాభివృధ్దితో సమానంగా ఉపాధి కల్పనలో అభివృద్ధి సాధించలేకపోయాయని ఆ అధ్యయనంలో తేల్చింది. అంతేకాదు. ఈ అసమతౌల్యం మున్ముందు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తుందని కూడా హెచ్చరించింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతకంతకూ సమీకృతమవుతున్న కొద్దీ, ఆర్థిక వ్యవస్థలపై పెట్టుబడి ఆధిపత్యం బిగుస్తున్న కొద్దీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉపాధి-అభివృద్ధి మధ్య సమన్వయం లోపించటం గత మూడు దశాబ్దాలుగా జరుగుతున్న పరిణామం. తొలుత సంపన్న దేశాల్లో 80వ దశకం చివర్లో కనిపించిన ఈ పరిణామం 90వ దశకం నాటికి విశ్వవ్యాప్త పరిణామంగా మారింది. స్థూలంగా చెప్పాలంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు 2003-2009 మధ్య కాలంలో సగటున 6శాతం చొప్పున వృద్ధి రేటు సాధిస్తే ఉపాధి కల్పన వృద్ధి రేటు మాత్రం 2 శాతానికి పరిమితం అయ్యింది. దీంతో వేగంగా పతనమ వుతున్న ఉపాధి అవకాశాలు పేదరికం నిర్మూలించాలన్న లక్ష్య సాధనపై ప్రభావం చూపిస్తున్నాయని తాజాగా ముగిసిస ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సహస్రాబ్ది లక్ష్యాల సాధనలో పురోగతి గురించి ఈ సమావేశాలు చర్చించాయి.

మూలాలు తడమని ఉద్దీపనలు

గత రెండు సంవత్సరాలుగా వివిధ దేశాలు అమలు చేసిన ఉద్దీపనలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరో దీర్ఘకాల మాంద్యంలోకి ప్రవేశించకుండా అడ్డుకోగలిగాయన్న విషయంలో ఆర్థిక వేత్తలు, విశ్లేషకులూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. అయితే, దీనికి భిన్నంగా, ఆర్థికవ్యవస్థలు కోలుకొంటున్న వేగంతోనైనా ఉపాధి అవకాశాలు కనిపించకపోవటంతో దీర్ఘకాల మాంద్యం ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. గత మూడు దశాబ్దాలుగా ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి - వినిమయం మధ్య ఉండాల్సిన సమతౌల్యం కూడా దెబ్బతిన్నది. ఉదారవాద విధానాలు పెట్టుబడికి డిమాండ్‌ను సృష్టించటంపై చూపించినంత శ్రద్ధాసక్తులు శ్రమశక్తికి డిమాండ్‌ సృష్టించటంపై చూపించకపోవటమే ఈ అసమతౌల్యానికి కారణం. ఈ అసమతౌల్యమే కొనుగోలు శక్తిపతనం, మదుపు చేయలేకపోవటం, ఆర్థిక వ్యవస్థల్లో వివిధ దశల్లో జరగాల్సిన కాపిటల్‌ ఫార్మేషన్‌ ప్రక్రియకు అంతరాయం కలగటం వంటి రూపాల్లో ప్రతిబింబిస్తోంది. దీని స్థానంలో పెట్టుబడి పోగుపడటం (కాపిటల్‌ ఎక్యుములేషన్‌) ప్రారంభమైంది. ఈ విషయంపై అంతర్జాతీయ కార్మిక అధ్యయనాల సంస్థ ప్రత్యేక అధ్యయనం నిర్వహించింది. అత్యధిక సందర్భాల్లో ఉద్దీపనలు సంక్షోభానికి కారకులైన బహుళజాతి ద్రవ్యసంస్థల లాభాలు నిలబెట్టటానికే దారితీశాయి. ఉద్దీనల కింద వెచ్చించిన నిధులు కూడా ఉత్పాదక రంగాన్ని పూర్తిగా విస్మరించి, నేరుగా మార్కెట్లోకి ప్రవేశించాయి. దాంతో లక్షల కోట్ల నిధులు వెచ్చించటం ద్వారా కలిగే ప్రయోజనాలు ఒనగూడలేదు. అందువల్లనే ఉద్దీపనల మోతాదు ఎక్కువగా ఉన్న అమెరికాలో కంపెనీలు, ద్రవ్య సంస్థల వద్ద లక్షల కోట్ల డాలర్ల నిల్వలుపేరుకుపోతున్న విషయాన్ని గతంలో ప్రస్తావించుకున్నాము. ఈ నిధులు మార్కెట్లోకి ప్రవేశిస్తే మళ్లీ స్పెక్యులేటివ్‌ కార్యక్రమాలకు తెరతీస్తాయి. ఇప్పటికే భారత స్టాక్‌ మార్కెట్లో విదేశీ సంస్థాగత నిధుల ప్రవాహం ఎలా ఉందో గమనిస్తూనే ఉన్నాము. ప్రపంచ వ్యాప్తంగా వడ్డీ రేట్లు సున్నాకు దగ్గరకావటం, కుప్పలు తెప్పలుగా రుణాలు అందుబాటులోకి రావటంతో ఈ విధంగా సేకరించిన నిధులను వర్ధమానదేశాల స్టాక్‌ మార్కెట్లలో కుమ్మరిస్తున్నాయి. తద్వారా స్వల్పకాలంలో లాభాలు సంపాదించుకుని తిరిగి ఎక్కడ నుండి రుణం ద్వారా ఈ నిధులు సమకూర్చబడ్డాయో ఆయా మార్కెట్లకు వెళ్లిపోతున్నాయి. తాజా సంక్షోభానికి మూలపునాదిగా ఉన్న ఆర్థిక అంతరాలను పరిష్కరించటానికి ఉద్దీపనలు పూనుకోకపోవటంతో 'సంపన్న దేశాల్లో అభివృద్ధి తిరిగి సంక్షోభ పూర్వపు లక్షణాలు-ఆర్థిక అంతరాలు పెంచేదిశగా పయనిస్తోంద'ని ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి మండలి వార్షిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

విస్తృతమవుతున్న పెట్టుబడి- శ్రమ శక్తి మధ్య వైరుధ్యం

ఈ పరిణామాలన్నీ పెట్టుబడికి, శ్రమశక్తికి మధ్య ఉన్న చారిత్రక వైరుధ్యాన్ని విస్తృతీకరిస్తున్నాయి. పైన చెప్పుకున్నట్లు ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక అవసరాలు తీర్చాల్సిన పెట్టుబడి సమీకరణ నేడు కొద్దిమంది చేతుల్లో బందీ అయ్యింది. గత మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు ఈ ప్రక్రియను మరింత వేగంతం చేసేవిగా ఉన్నాయి. ఏ దేశ ఆర్థిక వ్యవస్థలో చూసుకున్నా ప్రభుత్వాలు రూపొందించే విధానాలు, అమలు చేసే నిర్ణయాలు పెట్టుబడికి డిమాండ్‌ సృష్టించేవిగా ఉంటున్నాయి. అంటే పెట్టుబడే ఆర్థిక వ్యవస్థలో సర్వస్వం అని నిర్ధారించుకుని పెట్టుబడి అవసరాలు తీర్చటమే తమ కర్తవ్యంగా భావిస్తున్నాయి. ఈ మేరకే విధానాలు రూపొందిస్తున్నాయి. ఈ విధానాలు ఎగుమతి దిగుమతి విధానాల రూపంలో ఉండవచ్చు, ప్రత్యక్ష పరోక్ష పన్నుల రూపంలో ఉండవచ్చు. నేడు మన దేశంలో చర్చిస్తున్నట్లు పారిశ్రామిక రంగానికి ఇస్తున్న రాయితీల రూపంలో కనిపించవచ్చు. ఈ చర్యలన్నింటి వెనక ఉన్న సారాంశం, తర్కం ఒక్కటే. పెట్టుబడి అవసరాలు మనం తీర్చగలిగితే మన అవసరాలు పెట్టుబడి తీరుస్తుందన్న తర్కం. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి చిహ్నం ఉత్పత్తిసామర్థ్యం పెరగటం, వినిమయ సామర్థ్యం పెరగటం. లాభాలు సంపాదించటం. ఇవన్నీ సాధించటానికి పెట్టుబడి అనివార్యం. అయితే పెట్టుబడి ఒక్కటి ఉంటేనే సరిపోదు. ఏ ఆర్థిక వ్యవస్థల్లోనైనా స్థూల జాతీయోత్పత్తిలో మూడో వంతు శ్రామికవర్గం జత చేసే శ్రమ శక్తి. ప్రభుత్వ విధాన కర్తలు ఇప్పటి వరకూ ఈ జాతీయోత్పత్తికి దోహదం చేస్తున్న ఈ అంశం గురించి మర్చిపోయారు. దాంతో శ్రమశక్తి, పెట్టుబడి మధ్య వైరుధ్యంలో రాజ్యాంగయంత్రం పెట్టుబడి పక్షం వహించటంతో శ్రమశక్తి బలహీనపడింది. ఈ వైరుధ్యాన్ని సరిచేయటానికి శ్రమశక్తికి ఉన్న ఏకైక ఆయుధం సంఘం, సమైక్యత, సంఘటన, సంఘటిత పోరాటం మాత్రమే.

ఈ శ్రమ శక్తి అవసరాలు గురించి పట్టించుకోకకుండా కేవలం పెట్టుబడి అవసరాల ద్వారానే ఆర్థిక వ్యవస్థల అవసరాలు తీరతాయని భావించటం ప్రపంచీకరణ విధానాల్లోని ముఖ్యమైన లోపం. ఈ లోపమే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరో మహా మాంద్యం అంచులవరకూ తెచ్చింది. పెట్టుబడికి డిమాండ్‌ సృష్టించే విధానాల వల్ల తక్కువ వ్యయంతో ఎక్కువ ఉత్పత్తి సాధించే సామర్థ్యం సంపాదించటంతో పాటు విదేశాల్లో వాణిజ్య కార్యకలాపాలు విస్తరించుకోవటం, పన్నుఎగవేతల స్వర్గధామాల్లో నిధులు దాచుకోవటం వంటి చర్యలతో పాటు ఉత్పత్తి క్రమంలో శ్రమశక్తి-పెట్టుబడి మధ్య ఉండాల్సిన నిష్పత్తి దెబ్బతింటోంది. ఫలితంగా ఉపాధిరహిత అభివృద్ధి జరుగుతోంది. ఈ నిష్పత్తిని, సమతౌల్యాన్ని సరిచేయాలంటే పెట్టుబడి డిమాండ్‌ సృష్టించే విధానాల నుండి వైదొలగి శ్రమశక్తి మార్కెట్‌కు డిమాండ్‌ సృష్టించే విధానాలను ప్రభుత్వం చేపట్టాలి. దీనికి అనేక మార్గాలు ఉన్నాయి. స్థూల సూక్ష్మ ఆర్థిక యాజమాన్యంలో మార్పులు తేవటం ద్వారా ఈ విధానాలను అమలు చేయవచ్చు. ఈ దిశగా విధానాలు మళ్లనంత వరకూ ఐరాస వాణిజ్య అభివృద్ధి మండలి అభిప్రాయపడినట్లు ''2011 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాల మాంద్యంలోకి ప్రవేశించే ముప్పు'' నుండి ప్రపంచం బయటపడబోదు.

4, ఏప్రిల్ 2016, సోమవారం

నల్లధనంపై కనీవినీ ఎరుగని శోధన...1.15కోట్ల పత్రాల్లో గుట్టురట్టు 
బద్దలైన కుబేరుల బాగోతం 
ప్రపంచవ్యాప్తంగా పనామా సునామీ.. 
జాబితాలో పుతిన్‌ సన్నిహితులు సహా అనేక దేశాల నేతలు 
రాజకీయ పీఠాలకు తప్పని కుదుపు! 
భారత్‌ నుంచి 500 మంది పేర్లు 
అమితాబ్‌, ఐశ్వర్యలతోపాటు స్థిరాస్తి దిగ్గజాలు కేపీ సింగ్‌, సమీర్‌ గెహ్లాట్‌ 
ల్లధనమే తెల్లబోయే లెక్కలివి.. ప్రపంచానికి దిమ్మదిరిగే గణాంకాలివి.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సన్నిహితులు, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ బంధువులు, పాక్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ కుమారుల వరకు అనేకమంది ప్రపంచ నేతలు, వివిధ రంగాల ప్రముఖుల నల్ల జాతకాలు బట్టబయలయ్యాయి.
అంతర్జాతీయ పరిశోధనాత్మక విలేకరుల కూటమి (ఐ.సి.ఐ.జె.) పేరుతో వేర్వేరు దేశాల్లోని 100 మీడియా సంస్థల పాత్రికేయులు కూపీలాగి బయటపెట్టిన రహస్య పత్రాలు ఏకంగా 1.15 కోట్లు..! ఎకాఎకి 2.6 టెరాబైట్ల సమాచారాన్ని బయటకు లాగారు. చరిత్రలో నిలిచిపోయే అతిపెద్ద మీడియా శోధనల్లో ఇదొకటిగా అభివర్ణిస్తున్నారు. కట్టలు కట్టలుగా, గుట్టలు గుట్టలుగా ఖండాంతర దేశాల్లో గోప్యంగా దాచేసుకుని గుండెపై చేయివేసుకుని కూర్చొన్న పెద్దల పీఠాలు కదిలిపోయే పరిణామంగా అంతర్జాతీయ ప్రసార మాధ్యమాలు దీనిని పేర్కొనడంలో అతిశయోక్తి లేదు. సుమారు 140 మంది రాజకీయ ప్రముఖులు వేర్వేరు చోట్ల సంపాదించిన ఆస్తిపాస్తుల బండారం బట్టబయలయింది. పన్నులు చెల్లించకుండానో, ఇతరత్రా అక్రమ మార్గాల్లోనో వందల వేల కోట్ల రూపాయలు పోగు చేసుకున్న పెద్ద మనుషుల్లో కనీసం 500 మంది భారతీయులు ఉన్నారని అంచనాలు చెబుతున్నాయి.
ఏం జరిగింది?: ప్రపంచ వ్యాప్తంగా నల్ల కుబేరుల భోషాణాలు ఎక్కడెక్కడున్నాయో బయటపడింది.
ఎలా జరిగింది?: అంతర్జాతీయంగా ఓ కూటమిగా ఉన్న పరిశోధనాత్మక పాత్రికేయుల బృందం కొన్ని నెలల పాటు శ్రమించింది. నల్లధనాన్ని ఏ మార్గంలో ఎలా, ఎక్కడకు మళ్లిస్తున్నారో సాధికారిక ఆధారాలు సేకరించింది. ముఖ్యంగా పన్ను ఎగవేతదారులకు అనుకూలంగా ఉండే దేశాలకు అక్రమ ఆదాయాన్ని తరలించడంలో, అక్కడ పెట్టుబడులుగా మార్చడంలో కీలకంగా వ్యవహరించే సంస్థ నుంచి మొత్తం గణాంక సమాచారాన్ని ఒడిసి పట్టగలిగారు. ఆధార పత్రాల సంఖ్య ఏకంగా కోటి దాటడంతో ఇదో చరిత్రాత్మక ఘటనగా నిలిచిపోతోందని భావిస్తున్నారు. గతంలో వికీలీక్స్‌ ఎంత సంచలనం సృష్టించిందో అంతకంటే ఎక్కువ ప్రకంపనలు ఇప్పటికే మొదలయ్యాయి.
ప్రముఖులెవరు?: ఒకరా.. ఇద్దరా.. చైనా, రష్యా, పాకిస్థాన్‌, బ్రిటన్‌ సహా అనేక దేశాల అధినేతల పేర్లన్నీ వెలుగుచూశాయి. సన్నిహితుల పేరుతో కొందరు, కుటుంబీకుల సాయంతో ఇంకొందరు ఏమేం చేశారో తేటతెల్లమయింది. వీటి ఆధారంగా ఇప్పటికే ఆయా దేశాల్లో విపక్షాలు విమర్శనాస్త్రాలను పదునెక్కిస్తున్నాయి. అధికార పార్టీ తప్పుకోవాలనే డిమాండ్లు వూపందుకున్నాయి. భారత్‌లోనూ కుబేరుల జాబితా తక్కువేమీ కాదు. కనీసం 500 మంది ఉన్నారనే సమాచారం ఉలికిపాటు కలిగిస్తోంది.
నల్ల డబ్బెంత?: కాలిక్యులేటర్లు, కంప్యూటర్లు సయితం కూడలేనంత! కొన్ని దేశాల బడ్జెట్లనే మించిపోయినంత..!! ఒక అంచనా ప్రకారం మొత్తం నల్లధనం రూ.1550 లక్షల కోట్ల పైమాటే.
ఏం జరగబోతోంది?: తిరుగులేని ఆధారాలు బయటపడడంతో కొన్ని దేశాల్లో పీఠాలకే ఎసరొస్తోంది. ఖండాంతరాల్లో పోగుపడిన నల్లధనం తమది కాదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఆయా నేతలపై ఒక్కసారిగా పడింది. దీంతో వారంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

నల్ల కలకలం 
పారిస్‌
న్నులు చెల్లించకుండానో, ఇతరత్రా అక్రమ మార్గాల్లోనో వందల వేల కోట్ల రూపాయలు పోగు చేసుకున్న పెద్ద మనుషుల్లో కనీసం 500 మంది భారతీయులు ఉన్నారని పనామా పత్రాలు చెబుతున్నాయి. నేరుగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పేరు పత్రాల్లో లేకపోయినా ఆయనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులు కొన్ని బ్యాంకులు, బినామీ కంపెనీల ద్వారా రెండు బిలియన్‌ డాలర్ల (భారతీయ కరెన్సీలో సుమారు రూ.13,400 కోట్లు) సొమ్మును రహస్యంగా తరలించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. లభ్యమైన పత్రాల ప్రకారం నల్ల కుబేరుల జాబితాలో 12 మంది ప్రస్తుత, మాజీ దేశాధినేతలు ఉన్నారు. వీరిలో పాకిస్థాన్‌, ఐస్‌లాండ్‌ ప్రధానమంత్రులు, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు, సౌదీ అరేబియా రాజు, జాకీచాన్‌ వంటి సినీ దిగ్గజాలు, క్రీడాకారులు ఉన్నారు. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ కుటుంబానికి, బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ తండ్రికి (ఆయన దివంగతులయ్యారు.) విదేశీ ఖాతాలతో సంబంధాలున్నాయని పత్రాలు చెబుతున్నాయి. ఆర్థిక సంక్షోభం సమయంలో ఐస్‌లాండ్‌ ప్రధాని అనేక కోట్ల డాలర్ల సంపదను రహస్యంగా సొంతం చేసుకున్నారని పేర్కొంటున్నాయి. నిజానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆ దేశంలో కమ్యూనిస్టు పార్టీ నేతల అక్రమ సంపదపై పెద్దఎత్తున అవినీతి వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించారు. ప్రపంచ ఫుట్‌బాల్‌ పాలక మండలి నైతిక సంఘం సభ్యుడు జ్యూయన్‌ పెడ్ర దామియానికి ఉన్న వ్యాపార సంబంధాలనూ పత్రాలు బట్టబయలు చేశాయి. లక్షల సంఖ్యలో లభ్యమైన పత్రాల సంఖ్య దృష్ట్యా ఈ అంశం ప్రపంచంలోనే అతిపెద్దది అవుతుందని ఐ.సి.ఐ.జె. డైరెక్టర్‌ గెరార్డ్‌ రైలె అభిప్రాయపడ్డారు. రహస్య ఒప్పందాలకు తాము వ్యతిరేకమనీ, చట్టపరమైన సంస్థలకు అన్నివిధాలా సహకారాన్ని అందిస్తామనీ పనామా ప్రభుత్వం తెలిపింది.
ఎవరెవరికి ముప్పు? 
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ 
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ 
పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ 
బ్రిటన్‌ ప్రధాని కామెరాన్‌ 
సౌదీ అరేబియా రాజు 
ఉక్రెయిన్‌ అధ్యక్షుడు పేట్రో పొరొషెంకో 
ఐస్‌లాండ్‌ ప్రధాని సిగ్‌ముండర్‌ డేవిడ్‌ గున్లాగ్సన్‌ 
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్‌ జుమా 
కాంగో అధ్యక్షుడు డెనిస్‌ససౌ 
ప్రభుత్వాల్లో ప్రకంపనలు: నల్లధనం, అక్రమ సంపాదనల గుట్టు రట్టవడంతో అనేక ప్రభుత్వాల పీఠాలు కదిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ బావమరిది సహా ఎనిమిది మంది చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రస్తుత, మాజీ నేతల పేర్లు జాబితాలో ఉన్నాయి. చైనా మాజీ సైన్యాధిపతి గువో బోషియాన్‌ అవినీతి గురించీ ఇదే సమయంలో బయటపడడం కాకతాళీయమే అయినా ఇలాంటి వరస పరిణామాలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఐ.సి.ఐ.జె. వెబ్‌సైట్‌ను చైనాలో అధికారికంగా నిషేధించారు. పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ముగ్గురు పిల్లల పేర్లు (మరియం, హసన్‌, హుస్సేన్‌) పనామా పత్రాల్లో చోటు చేసుకోవడంతో ఆయన రాజకీయ దుమారంలో చిక్కుకున్నారు. తానెలాంటి తప్పు చేయలేదని షరీఫ్‌ అంటున్నా విపక్షం మాత్రం విచారణకు పట్టుపడుతోంది. షరీఫ్‌ తన పిల్లలకు అంత సొమ్ము ఎలా వచ్చిందో వివరణ ఇవ్వాలని పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ఖాన్‌ డిమాండ్‌ చేశారు.
అభిశంసనలు... రాజీనామా డిమాండ్లు...: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు పేట్రో పొరొషెంకోపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని ఉక్రెయిన్‌ పాపులిస్ట్‌ రాడికల్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. పనామా పత్రాలు వెల్లడిస్తున్న సమాచారం నేపథ్యంలో ప్రధాని రాజీనామా చేయాలని ఐస్‌లాండ్‌లో 16 వేల మంది సంతకాలు చేశారు. ప్రధానిపై అవిశ్వాసం ప్రవేశపెడతామని విపక్షం ప్రకటించింది. బ్రెజిల్‌లో ప్రతిపక్షం సహా ఏడు పార్టీలకు చెందిన నేతల పేర్లు జాబితాలో ఉన్నాయి. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్‌ జుమా మేనల్లుడి పేరు, కాంగో అధ్యక్షుడు డెనిస్‌ ససౌ కుమారుడి పేరు, ఘనా మాజీ అధ్యక్షుడు జాన్‌ అగ్యెకుం కుఫౌర్‌ కుమారుడి పేరు కూడా పనామా పత్రాల్లో చోటు చేసుకున్నాయి. కీలక పత్రాలు బయటపడడం వల్ల ప్రభుత్వాలకు ఆదాయం లభిస్తుందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్‌ వ్యాఖ్యానించారు. పన్ను ఎగవేతదారులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా... లీక్‌ అయిన పత్రాల నకలును తమకు సమర్పించాల్సిందిగా బ్రిటిష్‌ ప్రభుత్వం కోరింది. రాబోయే ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని అస్థిరత సృష్టించడానికే రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై నల్లధనం ఆరోపణలు చేస్తున్నట్లు క్రెమ్లిన్‌ వ్యాఖ్యానించింది. అర్జంటీనా మాజీ అధ్యక్షుడి అక్రమార్జనను దారి మళ్లించేందుకు అమెరికాలోని నెవడా రాష్ట్రంలో ఏకంగా 123 బోగస్‌ కంపెనీలను సృష్టించారు. ఐస్‌లాండ్‌ ప్రధాని సిగ్‌ముండర్‌ డేవిడ్‌ గున్లాగ్సన్‌ కొద్దిరోజుల్లోనే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనున్నారు.

భారత్‌లో
మన దేశ ఆర్థికరంగంలో మరో భిన్న కోణం బట్టబయలైంది. విదేశీసంస్థల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన వారి జాబితా తాజాగా మరోసారి వెల్లడైంది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ఆంగ్లపత్రిక భాగస్వామిగా ఉన్న అంతర్జాతీయ పరిశోధనాత్మక విలేకరుల కూటమి (ఐసీఐజే) బయటపెట్టిన ‘పనామా పత్రాల్లో’ 500 మందికిపైగా భారతీయుల పేర్లున్నాయి. యావత్‌దేశం అభిమానంతో బిగ్‌బీగా పిల్చుకునే అమితాబ్‌బచ్చన్‌, ఆయన కోడలు, మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యరాయ్‌ల పేర్లు కూడా ఈ జాబితాలో ఉండటం వారి అభిమానుల్ని ఆవేదనకు గురిచేసింది. వీరితోపాటు స్థిరాస్తి వ్యాపార రంగంలో దిగ్గజాలుగా పేరున్న డీఎల్‌ఎఫ్‌ అధిపతి పీకేసింగ్‌, ఇండియాబుల్స్‌ అధిపతి సమీర్‌ గెహ్లాట్‌, అపోలో టైర్స్‌ ఛైర్మన్‌ ఓంకార్‌ కన్వర్‌ తదితరులు ఉన్నారు. పన్ను అనుకూల బ్రిటీష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌, బహమాస్‌ తదితర దేశాల్లో వీరు ఏర్పాటుచేసిన కంపెనీలు, వాటిల్లో నిర్వహించిన లావాదేవీలు, పరోక్షంగా భారీఎత్తున జరిగిన లావాదేవీల వివరాలు వెల్లడయ్యాయి. అయితే తామంతా ఆర్‌బీఐ నిబంధనల మేరకే విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఆయా ప్రముఖులు పేర్కొన్నారు.
అమితాబ్‌బచ్చన్‌
1993 నవంబరులో నాలుగు విదేశీ నౌకాయాన కంపెనీలకు అమితాబ్‌బచ్చన్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ కంపెనీల పేర్లు.. సీబల్క్‌ షిప్పింగ్‌ కంపెనీ లిమిటెడ్‌, లేడీ షిప్పింగ్‌ లిమిటెడ్‌, ట్రెజర్‌ షిప్పింగ్‌ లిమిటెడ్‌, ట్రాంప్‌ షిప్పింగ్‌ కంపెనీ. ఇవి బ్రిటీష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌, బహమాస్‌లో ఏర్పాటయ్యాయి. బ్రిటీష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌, బహమాస్‌ నల్లధనం అనుకూల దేశాలు. ఈ కంపెనీల్లో పెట్టుబడిని అధికారికంగా 5,000-50,000 డాలర్లుగా మాత్రమే చూపించినప్పటికీ.. నౌకల వ్యాపారం పేరుతో ఈ సంస్థలు కొన్ని కోట్ల డాలర్ల వ్యాపారం నిర్వహించినట్లు వెల్లడైంది. ఈ కంపెనీలకు మేనేజింగ్‌ డైరక్టర్‌గా కూడా అమితాబ్‌ వ్యవహరించారు. వాస్తవానికి వీటిని ఉమేశ్‌సహాయ్‌, డేవిడ్‌మైఖేల్‌పెట్‌ అనే వ్యక్తులు వ్యవస్థాపక డైరెక్టర్లుగా ఏర్పాటుచేశారు. ఈ కంపెనీల్లో జరిగిన మొట్టమొదటి బోర్డు సమావేశంలోనే అమితాబ్‌బచ్చన్‌ను సహాయ డైరెక్టర్‌గా నియమించటం గమనార్హం. 1994లో ట్రాంప్‌ షిప్పింగ్‌ కంపెనీ, జెడ్డాకు చెందిన డైకో అనే కంపెనీకి మధ్య పెట్టుబడులకు సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. దీనికి పూచీదారుగా కాన్‌స్టలేషన్‌ షిప్‌ మేనేజ్‌మెంట్‌ అనే మరో సంస్థ సంతకం చేసింది. అనంతరం ట్రాంప్‌ కంపెనీ నుంచి వెయ్యివాటాలు కాన్‌స్టలేషన్‌ షిప్‌ మేనేజ్‌మెంట్‌కు బదిలీ అయ్యాయి. 1997లో అమితాబ్‌ ఇతర డైరెక్టర్లతో కలిసి ట్రాంప్‌ షిప్పింగ్‌ బోర్డు నుంచి రాజీనామా చేశారు. కాన్‌స్టలేషన్‌ కంపెనీ యజమాని కెప్టెన్‌ మెహెర్‌నూష్‌ ఖజోటియా 1998లో భారత్‌కు వచ్చి స్థిరపడ్డారు. 2006లో ఆయన మరణించారు. ముంబయిలోని పొలారిస్‌ గ్రూప్‌నకు, డైకోకు మధ్య తలెత్తిన వివాదం 2008లో బొంబాయి హైకోర్టును చేరింది.
కుశాల్‌పాల్‌సింగ్‌, డీఎల్‌ఎఫ్‌
నదేశంలోని అతిపెద్ద స్థిరాస్తి కంపెనీల గ్రూపు డీఎల్‌ఎఫ్‌ సంస్థ ప్రమోటర్‌ కుశాల్‌పాల్‌సింగ్‌ (కేపీ సింగ్‌) బ్రిటీష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో ఏర్పాటైన ‘విల్డర్‌ లిమిటెడ్‌’ కంపెనీని సొంతం చేసుకున్నారు. ఆయన భార్య ఇందిర ఈ కంపెనీలో సహవాటాదారుగా ఉన్నారు. ఈ కంపెనీ 1 జులై 2010లో నమోదైంది. దీని పెట్టుబడి రూ.16 కోట్లు. కేపీ సింగ్‌ కుమార్తె పియాసింగ్‌, కుమారుడు రాజీవ్‌సింగ్‌ కూడా బ్రిటీష్‌ ఐలాండ్స్‌లోనే మరో రెండు కంపెనీల వాటాలను కొనుగోలు చేశారు. 2012లో నమోదైన ఆల్ఫా ఇన్‌వెస్ట్‌మెంట్స్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌ కంపెనీలో పియాసింగ్‌, ఆమె భర్త ధీరజ్‌ టిమ్మీ సార్నా, వారి పిల్లలు జైసార్నా, తారాసింగ్‌సార్నా వాటాదారులుగా చేరారు. ఈ సంస్థ పెట్టుబడి రూ.25 కోట్లు. పీకేసింగ్‌ కుమారుడు రాజీవ్‌సింగ్‌ (డీఎల్‌ఎఫ్‌ గ్రూపు వైస్‌ఛైర్మన్‌) ‘బెకాన్‌ ఇన్‌వెస్ట్‌మెంట్స్‌ గ్రూప్‌ లిమిటెడ్‌’ అనే సంస్థలో వాటాదారుగా చేరారు. రాజీవ్‌తోపాటు ఆయన భార్య కవిత, కుమార్తెలు అనుష్క, సావిత్రి కూడా ఈ సంస్థలో వాటాలు తీసుకున్నారు. ఈ సంస్థ 2 జనవరి 2012లో నమోదైంది. దీని పెట్టుబడి రూ.25 కోట్లు. విల్డర్‌ లిమిటెడ్‌, ఆల్ఫా ఇన్‌వెస్ట్‌మెంట్స్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌, బెకాన్‌ ఇన్‌వెస్ట్‌మెంట్స్‌ గ్రూప్‌ లిమిటెడ్‌ల గురించి డీఎల్‌ఎఫ్‌ 2013-14 వార్షిక నివేదికలో ప్రస్తావించారు. ‘కీలక మేనేజ్‌మెంట్‌ వ్యక్తులు, వారి బంధువుల నియంత్రణలో ఉన్న సంస్థలు’గా వీటిని పేర్కొన్నారు.
సమీర్‌ గెహ్లాట్‌, ఇండియాబుల్స్‌
దేశంలోని అతిపెద్ద స్థిరాస్తి గ్రూపు సంస్థల్లో ఒకటైన ఇండియాబుల్స్‌ అధిపతి సమీర్‌ గెహ్లాట్‌. ఆయన సోదరుడు నాగేంద్ర, తండ్రి బల్వాన్‌సింగ్‌ కూడా గ్రూపుసంస్థల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. హరియాణాలోని కర్నాల్‌, దిల్లీ, బహమాస్‌, జెర్సీ, బ్రిటన్‌లలో ఉన్న తమ సంస్థల ద్వారా లండన్‌లోని మూడు స్థిరాస్తి ప్రాజెక్టులను సమీర్‌ కుటుంబం దక్కించుకుంది. వీటిని ప్రస్తుతం నివాస, హోటల్‌ ప్రాజెక్టులుగా అభివృద్ధి చేస్తున్నారు. ఇవన్నీ కూడా 2012 అక్టోబర్‌లో ఏర్పాటైన ఎస్‌జీ ఫ్యామిటీ ట్రస్ట్‌ యాజమాన్యం కింద ఉన్నాయి. దిల్లీలోని కాలీస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ ఈ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉందని, సదరు కాలీస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ బహమాస్‌లోని క్లైవెడేల్‌ ఓవర్సీస్‌ లిమిటెడ్‌ అనే సంస్థను సొంతం చేసుకుందని తాజాగా పనామా పత్రాల్లో వెల్లడైంది. అంతేకాదు.. క్లైవెడేల్‌ ఓవర్సీస్‌ కంపెనీ ఆధ్వర్యంలో అనేక అనుబంధ కంపెనీలు పని చేస్తున్నాయని.. ఇవన్నీ బహమాస్‌, మారిషస్‌, బ్రిటన్‌, జెర్సీల్లో ఉన్నట్లు తేలింది. వీటన్నింటికీ కర్నాల్‌లోని ఎస్‌జీ ఫ్యామిటీ ట్రస్టుతో సంబంధం ఉంది. లండన్‌లోని మూడు భారీ స్థిరాస్తి ప్రాజెక్టులు క్లైవెడేల్‌ సంస్థ యాజమాన్యం కింద ఉన్నట్లు వెల్లడైంది.
ఐశ్వర్యారాయ్‌
28 అక్టోబర్‌ 2004న ‘అమిక్‌ పార్ట్‌నర్స్‌ లిమిటెడ్‌’ అనే పేరుతో ఒక కంపెనీ బ్రిటీష్‌ వర్జిన్‌ ఐల్యాండ్స్‌లో నమోదైంది. 50 వేల డాలర్లతో ఏర్పాటైన ఈ కంపెనీకి ఐశ్వర్యారాయ్‌తోపాటు ఆమె కుటుంబసభ్యులు 14 మే 2005న డైరెక్టర్లుగా నియమితులయ్యారు. వీరిలో ఐశ్వర్యారాయ్‌ తండ్రి కృష్ణరాయ్‌, తల్లి వృందాకృష్ణరాజ్‌రాయ్‌, సోదరుడు ఆదిత్యరాయ్‌ ఉన్నారు. ఈ నలుగురూ 12,500 వాటాల చొప్పున కలిగి ఉన్నారు. ఒక్కోవాటా విలువ ఒక డాలరు. 2005 జూన్‌ 18న కంపెనీ చేసిన ఒక తీర్మానం ద్వారా ఐశ్వర్య, ఆమె తల్లి వృంద డైరెక్టర్‌ పదవుల నుంచి తప్పుకొని వాటాదారులుగా పరిమితమయ్యారు. దుబయ్‌లో జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐశ్వర్య తండ్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కుటుంబసభ్యులందరూ హాజరయ్యారు. ఐశ్వర్యరాయ్‌ అనే పేరును ఏ.రాయ్‌ అని మార్చారు. ఈ మార్పును డైరెక్టర్లు, వాటాదారులందరూ ఆమోదించారు. అభిషేక్‌బచ్చన్‌తో ఐశ్వర్య వివాహం జరిగిన తర్వాత మరుసటి ఏడాది (2008లో) కంపెనీని రద్దు చేసే ప్రక్రియ మొదలైంది. మొత్తానికి కంపెనీ ఎప్పుడు రద్దయ్యిందనేదానిపై స్పష్టత లేదు. ఆ ప్రక్రియ 2008లోనే పూర్తయిందని కొన్ని పత్రాలు, 2016 వరకూ కొనసాగిందని మరికొన్ని పత్రాలు వెల్లడిస్తున్నాయి.
గర్వారే కుటుంబం
మొసాక్‌ ఫోన్సెకా రికార్డుల ప్రకారం గర్వారే కుటుంబానికి పలు విదేశీ సంస్థలతో సంబంధం ఉంది. 1996లో బ్రిటన్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో రిజిస్టర్‌ చేసిన రాండార్‌ ఓవర్సీస్‌ లిమిటెడ్‌లో అశోక్‌గర్వారే షేర్‌హోల్డర్‌. ఆదిత్య గర్వారే, సుష్మా గర్వారేలకు పలు పనామా సంస్థల్లో పవర్‌ ఆఫ్‌ అటార్నీ(పీవోఏ) ఉంది. గ్లోబల్‌ ఆఫ్‌షోర్‌ సర్వీసెస్‌కు అశోక్‌ కార్యనిర్వాహక ఛైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, ఆయన తనయుడు ఆదిత్య ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఆదిత్య, సుష్మా గర్వారేలకు కనీసం ఆరు పనామా సంస్థల్లో పీఓఏ ఉందని తెలుస్తోంది. ఇవన్నీ 2009 నుంచి పనిచేయడం లేదు. గర్వారేలు ఫుజియామా టీం ఫౌండేషన్‌ ఏర్పాటు చేశారు. అశోక్‌, సుష్మా, ఆదిత్య ప్రధాన లబ్ధిదారులు.
స్పందన: కంపెనీ సెక్రటరీ ఏసీ చందరణ స్పందిస్తూ.. ఈ ప్రశ్నలన్నీ ఐదేళ్ల క్రితంవనీ, మరోసారి వీటిని పరిశీలిస్తామన్నారు. పీవోఏల గడువు ముగిసిపోయాయనీ, సంస్థలు రద్దయ్యాయన్నారు. అశోక్‌ గర్వారే, ఆయన కుటుంబానికి సదరు సంస్థలతో ఏ సంబంధం లేదన్నారు.
ఓంకార్‌ కన్వర్‌
పోలో గ్రూప్‌ ఛైర్మన్‌. ఓంకార్‌, ఆయన కుటుంబం బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో 2010లో జేఅండ్‌ఎస్‌ సిస్టమ్స్‌ కార్పొరేషన్‌ను, 2014లో రెండు ట్రస్టులను ఏర్పాటు చేసింది. ఫోన్సెకా రికార్డుల్లో పలు వివరాలున్నాయి. ఓంకార్‌తోపాటు నీరజ్‌, సిమ్రాన్‌ కన్వర్‌లూ జేఅండ్‌ఎస్‌లో షేర్‌హోల్డర్లే. ఓంకార్‌ భార్య తారుకన్వర్‌కు షేర్లున్నాయి.
స్పందన: అపోలో టైర్స్‌ గ్రూప్‌ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. కొన్ని నిబంధనల మేరకు విదేశీ పెట్టుబడుల్ని భారత్‌ చట్టబద్ధంగానే అనుమతిస్తోంది. భారత చట్టాల ప్రకారమే విదేశీ పెట్టుబడులున్నాయి.
జహంగీర్‌ ఎస్‌ సొరాబ్జీ
మాజీ అటార్నీ జనరల్‌ సోలి సొరాబ్జీ కుమారుడు జహంగీర్‌ సోలి సొరాబ్జీ. 2010లో బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో ఏర్పాటు చేసిన మూన్‌గ్లోవ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌లో ఏకైక షేర్‌హోల్డర్‌. ఫోన్సెకా రికార్డుల ప్రకారం..కంపెనీకి డైరెక్టర్‌గా వ్యవహరించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.
స్పందన: సరళీకృత ఆర్‌బీఐ పథకంలో భాగంగానే భారత్‌ నుంచి పెట్టుబడులు విదేశానికి వెళ్లాయన్నారు. ఆదాయపన్ను రిటర్నుల్లో వివరాలను వెల్లడించానన్నారు.
మోహన్‌లాల్‌ లోహియా
ప్రముఖ పారిశ్రామికవేత్త. ఫోన్సెకా రికార్డుల ప్రకారం.. 2007లో బ్రిటన్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో రిజిస్టర్‌ చేసిన వెంటన్‌ గ్రూప్‌ లిమిటెడ్‌లో ఫస్ట్‌ డైరెక్టర్‌. 2010లో పనామాలో లోహియా ఛారిటబుల్‌ ట్రస్ట్‌ను సైతం ఏర్పాటుచేశారు. ఆయన మనవలు సభ్యులు.
స్పందన: లోహియా కుటుంబ సభ్యులు ప్రవాస భారతీయులనీ, విదేశాల్లోనే స్థిరనివాసం ఏర్పాటుచేసుకున్నారనీ, విదేశాల్లోని సంస్థల గురించి తమకు తెలియదనీ, ప్రవాస భారతీయులు విదేశాల్లో చేసే కార్యకలాపాల గురించి ఆదాయపన్ను అధికారులకుగానీ, ఆర్‌బీఐకిగానీ తెలియజేయాలనేదేమీ లేదని కంపెనీ అధికారప్రతినిధి పేర్కొన్నారు.
జవరే పూనావాలా
ఫోన్సెకా రికార్డుల ప్రకారం.. జవరే, భార్య బెహ్రోజ్‌, కుమార్తెలు సైమోన్‌, డెల్నాలు 2013లో బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో ఏర్పాటుచేసిన స్టాలాస్ట్‌ లిమిటెడ్‌లో డైరెక్టర్లు.
స్పందన: తాము ఆ కంపెనీలో సంచాలకులమేననీ, సరళీకృత పథకం ద్వారానే డబ్బులు తరలించామనీ, ఇందుకు ఆర్‌బీఐ అనుమతి అక్కర్లేదనీ, అధికారిక లావాదేవీయేనన్నారు. అన్ని వివరాలూ వెల్లడించామని జవరే పేర్కొన్నారు.
శిశిర్‌ కె.బజోరియా
కోల్‌కతాలో జౌళి,తేయాకు వ్యాపారం చేసే వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి..శిశిర్‌ బజోరియా. ఎస్కే బజోరియా గ్రూప్‌ ప్రమోటర్‌. దీనికి ఆరు దేశాల్లో స్టీల్‌ రీఫ్రాక్టరీ యూనిట్లు ఉన్నాయి. 2015లో బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లోని హ్యాప్టిక్‌ లిమిటెడ్‌కు లబ్ధిదారులైన యజమాని. దీనిని మొసాక్‌ ఫోన్సెకా సంస్థ, ఫస్ట్‌నేమ్స్‌గ్రూప్‌తో కలిసి బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో 2015లో ఏర్పాటు చేసింది. హ్యాప్టిక్‌ కోసం ఫోన్సెకా రికార్డుల్లో బజోరియా పాస్‌పోర్ట్‌ ప్రతి, అతని భారత చిరునామా కూడా ఉన్నాయి. పశ్చిమ్‌బంగా మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసుకు సన్నిహితుడైన బజోరియా సీపీఎం సభ్యత్యాన్ని వదులుకొని 2014లో భాజపాలో చేరారు. రాబోయే పశ్చిమ్‌బంగా అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా కీలక ప్రచారకర్తల్లో ఒకరు.
స్పందన: హ్యాప్టిక్‌ లిమిటెడ్‌కు ఎప్పుడూ యజమానిని కాననీ, పొరపాటుగా తనకు సంబంధాన్ని ఆపాదించారని భావిస్తున్నానన్నారు. లబ్ధిదారులైన యజమానికి సంబంధించిన సమాచారాన్ని పంపడంలో తాము పొరపాటు చేశామని ఫస్ట్‌నేమ్స్‌ గ్రూప్‌ ప్రతినిధి సీజీ హెప్‌బర్న్‌ పేర్కొన్నారు.
హరీశ్‌సాల్వే
దేశంలో ప్రఖ్యాత న్యాయవాది. ఫోన్సెకా రికార్డుల ప్రకారం.. బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లోని మూడు కంపెనీలకు హరీశ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లండన్‌కు చెందిన రావిఅండ్‌కో ద్వారా విదేశీ కంపెనీలను రిజిస్టర్‌ చేశారు. 2007లో రమేశ్‌, ఆశా మహాజన్‌ల కోసం ఓ కంపెనీ, ట్రస్టును ఏర్పాటు చేయాల్సిందిగా సాల్వే రావిఅండ్‌కంపెనీకి సిఫారసు లేఖ రాశారు. సాల్వే క్రెస్ట్‌బ్రైట్‌ లిమిటెడ్‌లో సంచాలకులని పత్రాల్లో ఉంది. మరో రెండు కంపెనీలకు సాల్వే భార్య మీనాక్షి, కుమార్తె సాక్షి సంచాలకుల్లా ఉన్నారు.
స్పందన: చట్టబద్ధంగా, దాపరికంలేని పెట్టుబడుల కోసం 2012లో క్రెస్ట్‌బ్రైట్‌ను ఏర్పాటుచేశాననీ, కంపెనీలో మిగులేమీ లేదన్నారు. మూడు కంపెనీలూ పనిచేయడం లేదన్నారు. భారత్‌, యూకేల్లోని బ్యాంకు వివరాలనూ సమర్పించాననీ, ఏవీ పక్కనపెట్టలేదని సాల్వే తెలిపారు.
ఇందిరా శివశైలం, మల్లిక శ్రీనివాసన్‌
మల్గమేషన్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనంతరామకృష్ణన్‌ భార్య ఇందిర 2008లో అనారోగ్యంతో మరణించారు. ఫోన్సెకా రికార్డుల ప్రకారం.. 1999లో బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో ఏర్పాటైన స్టాన్‌బ్రిడ్జ్‌ కంపెనీ లిమిటెడ్‌లో ఇందిర షేర్‌హోల్డర్‌. వీరి షేర్లను కుమార్తెలకు బదిలీ చేశారు. 2011లో మల్లిక తన షేర్లను వీపీఅహూజాకు ఇచ్చేశారు.
స్పందన: తానెలాంటి విదేశీ కంపెనీని ఏర్పాటుచేయలేదని మల్లికా శ్రీనివాసన్‌ పేర్కొన్నారు. స్టాన్‌బ్రిడ్జ్‌ కంపెనీతో ఎలాంటి సంబంధం లేదనీ, అది అహూజాదని మల్లిక పేర్కొన్నారు. ఆ కంపెనీ తన ప్రయోజనాల కోసం ఏర్పాటుచేసినట్లు అహూజా తెలిపారు.
అనిల్‌ వాసుదేవ సల్గోకర్‌
గోవాకు చెందిన గనుల వ్యాపారి. ఫోన్సెకా సాయంతో 11 విదేశీ కంపెనీలను ఏర్పాటుచేశారు. వీటిలో ఎక్కువగా బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్‌లోనే ఏర్పాటయ్యాయి. ఎక్కువ భాగం 2004-05 మధ్యే నెలకొల్పినట్లు రికార్డులు చెబుతున్నాయి. 2007లో ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన సందర్భంగా అనిల్‌ ఈ కంపెనీల వివరాలేమీ ఈసీకి వెల్లడించలేదు. అనిల్‌ అనారోగ్యంతో మరణించారు.
స్పందన: సదరు కంపెనీల గురించి తమకేమీ తెలియదని అనిల్‌ కుటుంబసభ్యులొకరు పేర్కొన్నారు.
రాజేంద్ర పాటిల్‌
రాజేంద్రపాటిల్‌..సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, కర్ణాటక ఉద్యానమంత్రి షమనూర్‌ శివశంకరప్ప అల్లుడు. ఫోన్సెకా రికార్డుల ప్రకారం.. పాటిల్‌ అనుయాయులు సంజయ్‌ నాద్గౌడ, శశాంక్‌ అంగడి 2007లో బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్‌లో ఎల్గెన్‌బర్గ్‌ లిమిటెడ్‌ అనే కంపెనీని నెలకొల్పారు. ఇందులో పాటిల్‌కూ హోల్డింగ్‌ ఉంది.
స్పందన: ఐరోపాలో లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ జారీ చేసేందుకే కంపెనీ ఏర్పాటుచేశామని పాటిల్‌ పేర్కొన్నారు. నష్టాలు రావడంతో అదే ఏడాది మూసేశామన్నారు.
తబసుమ్‌, అబ్దుల్‌ రషీద్‌ మిర్‌
ఫోన్సెకా రికార్డుల ప్రకారం.. 2002లో పనామాలో సీఐఈ అనే సంస్థను ఏర్పాటుచేశారు.
స్పందన: తనకుగానీ, అబ్దుల్‌రషీద్‌కుగానీ ఎలాంటి వాటాలు లేవని తబసుమ్‌ పేర్కొన్నారు. అది ట్రస్టు నియంత్రణలో ఉందనీ, అది కూడా రద్దయిందన్నారు.