2, మార్చి 2015, సోమవారం

రాజధాని నిర్మాణం కోసం వేల ఎకరాలు నాశనం సబబా?

  • 23/12/2014
ఏపి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రైతు స్వరాజ్య వేదిక
హైదరాబాద్, డిసెంబర్ 22: రాజధాని నిర్మాణాన్ని రియల్ ఎస్టేట్ వ్యవహారంగా చూడటం తగదని రైతు స్వరాజ్య వేదిక ఆవేదన వ్యక్త చేసింది. రాజదాని నిర్మాణం కోసం తహతహలాడుతున్న ప్రభుత్వ తీరుచూస్తుంటే కొంత మంది వ్యక్తులకు లబ్ధిచేకూర్చేలా ఉందని విమర్శించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వేదిక ప్రతినిధులు విస్సా కిరణ్, కనె్నగంటి రవి, ఉమాశంకరి మాట్లాడుతూ వేల రాజధాని నిర్మాణం కోసం వేల ఎకరాల భూములను నాశనం చేయడం ఎంత వరకు సబబని అన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకువచ్చి రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములను లాక్కొనేందుకు ప్రభు త్వం ప్రయత్నిస్తుందని అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ సూచించిన వాటిని సైతం పక్కన పెట్టి ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటుందని విమర్శించారు. అన్నపూర్ణగా పేరొందిన విజయవాడ, గుంటూరు మధ్య ఉన్న వేల ఎకరాల భూములను భవన నిర్మాణాల కోసం వినియోగించడం సరికాదని అన్నారు. దీని ద్వారా భూములు కోల్పోతున్న రైతులతో పాటు ఆయా వ్యవసాయక్షేత్రాలలో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న వారు ఉపాధికి దూరమవుతారని పేర్కొన్నారు. అలాంటి వారి కోసం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వం నిర్ధిష్టంగా పేర్కొనడం లేదన్నారు. ఎంతో మంది గిరిజనులను ముంచి నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నుంచి రాజధాని అవసరాల కోసం నీటిని తరలించడం సరికాదని ఆ నీటిని కేవలం వ్యవసాయ అవసరాల కోసమే వాడాలని అన్నారు. ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల నుంచి సేకరించిన భూములను సరైన పారితోషకం, వారికి పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి